ప్రశ్న
క్రీస్తు నీతి మనకు ఎందుకు ఆపాదించబడాలి?
జవాబు
మనకు మన సొంత నీతి లేనందున, క్రీస్తు నీతి మనకు ఆపాదించబడాలి. మనం స్వభావతహా పాపులం, మరియు మనల్ని మనం నీతిమంతులుగా చేసుకోలేము—మనం దేవునితో సరియైన సంబంధంలో ఉండలేము. క్రీస్తు నీతి మనకు ఆపాదించబడాలి—అంటే, దేవుడు మన ఖాతాలో ఆయన పరిశుద్ధతను జమచేయాలి.
మత్తయి 5:48లో, తన పర్వత ప్రసంగంలో యేసు, మనకు లెక్కించబడిన నీతి అవసరాన్ని స్పష్టం చేసారు. ఆయన ఇలా అంటున్నారు, "కాబట్టి మీరు పరిపూర్ణులైయుండవలెను, మీ పరలోకమందున్న తండ్రియు పరిపూర్ణుడైయున్నట్లు." యేసు తన శ్రోతలకు ధర్మశాస్త్రం గురించిన అపార్థాన్ని సరిదిద్దిన తర్వాత ఈ మాట చెప్పారు. మత్తయి 5:20లో, తన మాట వింటున్న వారు పరలోక రాజ్యంలోకి ప్రవేశించాలంటే, ధర్మశాస్త్ర జ్ఞానంలో నిపుణులైన ఫరీశీయుల నీతికంటే వారి నీతి అధికంగా ఉండాలని యేసు చెబుతాడు.
ఆ తర్వాత, మత్తయి 5:21–47లో, యేసు ఫరిశీయుల "నీతిని" వర్ణించే కేవలం బయటి ఆచరణకు మాత్రమే పరిమితమైన ధర్మశాస్త్ర విధేయతను, బయటి మరియు లోపలి ఆచరణ రెండింటికీ విధేయత చూపే విధంగా స్పష్టంగా పునర్నిర్వచించారు. ఈ భాగంలో ఆరుసార్లు ఆయన, "ఎవరు చెప్పారంటే... కానీ నేను మీతో చెప్తున్నాను" అని అంటారు. ఈ విధంగా, ప్రజలకు బోధించబడిన ధర్మశాస్త్ర నిబంధనలను, దాని వాస్తవ నిబంధనల నుండి యేసు వేరుచేసి చూపించారు. ఉదాహరణకు, ధర్మశాస్త్రాన్ని పాటించడం అనేది కేవలం హత్య లేదా వ్యభిచారం నుండి దూరంగా ఉండటం కంటే ఎక్కువ. అది మీ సోదరునిపై కోపపడకపోవడం మరియు మీ హృదయంలో కామంతో ఉండకపోవడం కూడా. ప్రసంగంలోని ఈ భాగం చివరలో, మనం "పరిపూర్ణులుగా ఉండాలి" అని యేసు చెప్పారు (వచనం 48).
ఈ సమయంలో, సహజమైన ప్రతిస్పందన, "కానీ నేను పరిపూర్ణంగా ఉండలేను" అనేది, ఇది పూర్తిగా నిజం. మత్తయి సువార్తలో మరొకచోట, యేసు దేవుని ధర్మశాస్త్రాన్ని రెండు ఆజ్ఞలతో సంగ్రహించారు: నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణహృదయముతో, నీ పూర్ణఆత్మతో, నీ పూర్ణమనస్సుతో, నీ పూర్ణబలముతో ప్రేమించుము, మరియు నీ పొరుగువానిని నీవు నీవలె ప్రేమించుము (మత్తయి 22:37–40). ఈ ఆజ్ఞలు మనలను ఖండిస్తాయి కూడా, ఎందుకంటే తన పూర్తి హృదయముతో, ప్రాణముతో, మనస్సుతో మరియు బలముతో ప్రభువును ప్రేమించి, తన పొరుగువానిని తనలాగే ప్రేమించిన వారు ఎవరైనా ఉన్నారా? మనం చేసే, చెప్పే, మరియు ఆలోచించే ప్రతిదీ దేవుని ప్రేమతో మరియు పొరుగువారి ప్రేమతో చేయబడాలి, చెప్పబడాలి మరియు ఆలోచించబడాలి. మనం ఎన్నడూ ఆ ఆధ్యాత్మిక స్థాయిని సాధించలేదు. మనం నీతిమంతులం కాదు.
పాపం మన సత్త్వానికి మూలం వరకు ప్రభావితం చేస్తుంది, మరియు మనం ఎంత మంచివారై ఉండటానికి ప్రయత్నించినా, మన సొంతంగా దేవుని పరిపూర్ణత ప్రమాణాన్ని ఎప్పటికీ అందుకోలేము. మన నీతిపూర్వకమైన క్రియలన్నీ "అపవిత్రమైన వస్త్రమువంటివి" అని బైబిల్ చెబుతుంది (యెషయా 64:6). మన సొంత మంచి ప్రయత్నాలు సరిపోవు. మనకు లెక్కించబడిన నీతి అవసరం, మరియు దాని కోసం మనం క్రీస్తు వైపు చూస్తాము.
క్రూశుపై, యేసు మన పాపాన్ని తనపైకి తీసుకుని, మన రక్షణను కొనుగోలు చేశారు. మనం "ఆయన రక్తము ద్వారా నీతిమంతులమైతిమి" (రోమీయులు 5:9), మరియు ఆ నీతిగా పరిగణించబడటంలో ఒక భాగం ఆయన సొంత నీతిని మనకు ఆపాదించడం. పౌలు దీనిని ఈ విధంగా చెబుతున్నారు: "పాపమెరుగని ఆయనను మనకొరకు పాపముగా చేసెను; అందుచేత ఆయనయందు మనము దేవుని నీతిగా కలుగుదము" (2 కొరింథీయులు 5:21). యేసు తన సహజ లక్షణాల వల్ల నీతిమంతుడు—ఆయన దేవుని కుమారుడు. దేవుని కృప ద్వారా, "యేసు క్రీస్తులో విశ్వాసము ద్వారా," ఆ నీతి "విశ్వసించు వారందరికిని" ఇవ్వబడుతుంది (రోమీయులు 3:22). అదే ఆపాదించడం: పాపులకు క్రీస్తు నీతిని ఇవ్వడం.
క్రీస్తు నీతి మనకు ఆపాదించబడటం అంటే మనం స్వయంచాలకంగా సరైనది చేస్తామని కాదు—అది పరిశుద్ధీకరణ ప్రక్రియ ద్వారా వస్తుంది. దాని అర్థం ఏమిటంటే, మనం స్థితిపరంగా నీతిమంతులం; మనం ఇప్పటికీ పాపం చేసినప్పటికీ, మనం న్యాయపరంగా లేదా చట్టపరంగా నీతిమంతులం. దేవుడు క్రీస్తు నీతిని మన ఖాతాలో జమ చేశారు, మరియు ఆయన మనలను రక్షించినప్పుడు ఇలా చేశారు. కృపలో, యేసు క్రీస్తు పరిశుద్ధత మనకు ఆపాదించబడింది. క్రీస్తు "మన కొరకు దేవునివలన జ్ఞానముగా, నీతిగా, పరిశుద్ధతగా, విమోచనగా ఆయనే నియమించబడ్డారు" (1 కొరింథీయులు 1:30).
క్రీస్తు నీతి మనకు ఆపాదించబడటం ద్వారా, యేసు ఎలాగైతే పాపరహితుడో, మనం కూడా పాపరహితులుగా పరిగణించబడగలం. ఇది అద్భుతమైన కృప! మనం మనలో నీతిమంతులు కాదు; బదులుగా, మన ఖాతాలో జమ చేయబడిన క్రీస్తు నీతిని మనం కలిగి ఉన్నాము. దేవుడు మనల్ని తనతో సంబంధంలోకి తీసుకువచ్చినప్పుడు, ఆయన చూసేది మన పరిపూర్ణతను కాదు, క్రీస్తు పరిపూర్ణతను. మనం ఆచరణలో ఇప్పటికీ పాపులమే, కానీ దేవుని కృప మనల్ని ధర్మశాస్త్రమునందు నీతిగల స్థితిలో ఉన్నవారిగా ప్రకటించింది.
క్రీస్తు యొక్క ఆపాదింపబడిన నీతికి ఒక అద్భుతమైన ఉదాహరణ యేసు చెప్పిన పెండ్లి విందు బోధలో కనిపిస్తుంది. రాజు యొక్క వేడుకకు ప్రతి వీధి మూల నుండి అతిథులు ఆహ్వానించబడతారు, మరియు వారు "చెడ్డవారిని మంచివారిని" అందరూ లోపలికి తీసుకురాబడతారు (మత్తయి 22:10). అతిథులందరికీ ఒక విషయం ఉమ్మడిగా ఉంది: వారిలో ప్రతి ఒక్కరికీ పెళ్లి వస్త్రం ఇవ్వబడింది. వారు విందు హాలులో తమ వీధి బట్టలు ధరించకూడదు, కానీ రాజు అందించిన వస్త్రంలోనే ఉండాలి. వారు కృపతో కూడిన బహుమతితో కప్పబడ్డారు. అదేవిధంగా, దేవుని గృహంలోకి ఆహ్వానించబడిన అతిథులుగా మనకు క్రీస్తు నీతి యొక్క స్వచ్ఛమైన తెల్లని వస్త్రం ఇవ్వబడింది. ఈ దేవుని కృప యొక్క బహుమతిని మనం విశ్వాసము ద్వారా పొందుతాము.
English
క్రీస్తు నీతి మనకు ఎందుకు ఆపాదించబడాలి?