ప్రశ్న
క్రైస్తవ విశ్వాసంలో ఏది ఎక్కువ ముఖ్యమైనది, క్రీస్తు మరణమా లేక ఆయన పునరుత్థానమా?
జవాబు
క్రీస్తు మరణం మరియు పునరుత్థానం రెండూ సమానంగా ముఖ్యమైనవి. యేసు మరణం మరియు పునరుత్థానం వేర్వేరు అయినప్పటికీ, ఒకదానికొకటి అవసరమైన విషయాలను నెరవేరుస్తాయి. మన ప్రభువు యొక్క మరణం మరియు పునరుత్థానం నిజంగా వస్త్రంలోని నూలు అల్లికలా విడదీయరానివి.
క్రీస్తు సిలువ మన కోసం ఒక విజయాన్ని సాధించిపెట్టింది, దానిని మనం మన కోసం ఎప్పటికీ సాధించుకోలేము. "ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి, సిలువచేత జయోత్సవముతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనుపరచెను" (కొలొస్సయులు 2:15). సిలువ మీద దేవుడు మన పాపములను యేసు మీద మోపి, మనకు రావలసిన శిక్షను ఆయన మోసెను (యెషయా 53:4–8). ఆయన మరణములో, ఆదాదు ప్రవేశపెట్టిన శాపమును యేసు తన మీదకు తీసికొనెను (గలతీయులు 3:13 చూడండి).
క్రీస్తు మరణముతో, మన పాపములు మన మీద ఆధిపత్యము చేయుటకు శక్తిలేనివిగా అయ్యాయి (రోమీయులు 6). ఆయన మరణము ద్వారా, యేసు అపవాది కార్యములను నాశము చేసెను (యోహాను 12:31; హెబ్రీయులు 2:14; 1 యోహాను 3:8), సాతానును ఖండించెను (యోహాను 16:11), మరియు సర్పపు తలను నలిపేసెను (ఆదికాండము 3:15).
క్రీస్తు యొక్క బలి మరణం లేకుండా, మనం ఇప్పటికీ మన పాపాలలోనే ఉండేవాళ్ళం, క్షమించబడకుండా, విమోచించబడకుండా, మరియు రక్షణ పొందకుండా ఉండేవాళ్ళం. క్రీస్తు సిలువ మన రక్షణకు అత్యంత ఆవశ్యకమైనది మరియు అందువల్ల అది అపొస్తలుల ప్రసంగాలలో ఒక ప్రధాన విషయంగా ఉండేది (అపోస్తలుల కార్యములు 2:23, 36; 1 కొరింథీయులు 1:23; 2:2; గలతీయులు 6:14).
కానీ యేసు క్రీస్తు కథ ఆయన మరణంతో ముగిసిపోలేదు. క్రీస్తు పునరుత్థానం కూడా సువార్త సందేశానికి పునాది. 1 కొరింథీయులు 15:12–19లో పౌలు స్పష్టం చేసినట్లుగా, యేసు క్రీస్తు శారీరక పునరుత్థానం మీద మన రక్షణ ఆధారపడి ఉంటుంది. క్రీస్తు శారీరకంగా మృతులలో నుండి పునరుత్థానం కాకపోతే, మనకు పునరుత్థానం యొక్క నిరీక్షణ లేదు, అపొస్తలుల ప్రసంగము వ్యర్థమైపోయింది, మరియు విశ్వాసులందరూ జాలిపడదగినవారవుతారు. పునరుత్థానం లేకుండా, మనం ఇంకా "చీకటిలోను మరణ ఛాయలోను" ఉండి, సూర్యోదయం కోసం (లూకా 1:78–79) వేచి ఉన్నట్లే.
యేసు పునరుత్థానం వలన, ఆయన వాగ్దానం మనకు నిజమవుతుంది: "నేను బ్రదుకుచున్నాను, మీరును బ్రదుకుదురు" (యోహాను 14:19). మన గొప్ప శత్రువైన మరణం ఓడించబడుతుంది (1 కొరింథీయులు 15:26, 54–55). యేసు పునరుత్థానం కూడా ముఖ్యమైనది, ఎందుకంటే ఆ సంఘటన ద్వారా దేవుడు మనలను నీతిమంతులుగా ప్రకటిస్తాడు: యేసు "మన నీతిని స్థాపించుటకు బ్రదికించబడ్డాడు" (రోమీయులు 4:25). పరిశుద్ధాత్మ వరము పునరుత్థానం పొంది, పరలోకమునకు హారతి పొందిన ప్రభువైన యేసు నుండి పంపబడింది (యోహాను 16:7).
తన భూమిపై పరిచర్యలో కనీసం మూడుసార్లు, తాను చనిపోయి మూడు రోజుల తర్వాత తిరిగి లేస్తానని యేసు ప్రవచించాడు (మార్కు 8:31; 9:31; 10:34). యేసు క్రీస్తు మృతులలో నుండి లేవలేకపోయి ఉంటే, ఆయన తన ప్రవచనాలలో విఫలమయ్యేవారు—ఆయనను పట్టించుకోవాల్సిన మరో అబద్ధ ప్రవక్తగా మిగిలిపోయేవారు. అయితే, వాస్తవానికి, మనకు తన వాక్యానికి నమ్మకమైన, సజీవ ప్రభువు ఉన్నాడు. యేసు ఖాళీ సమాధి వద్ద ఉన్న దేవదూత నెరవేరిన ప్రవచనాన్ని సూచించగలిగాడు: "ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచియున్నాడు" (మత్తయి 28:6).
గ్రంథము క్రీస్తు మరణమును మరియు పునరుత్థానమును అనుసంధానిస్తుంది, మరియు మనం ఆ అనుసంధానాన్ని నిలబెట్టుకోవాలి. యేసు సమాధిలోకి ప్రవేశించడం, ఆయన సమాధి నుండి బయటకు రావడం రెండూ సమానంగా ముఖ్యమైనవి. 1 కొరింథీయులు 15:3–5లో, పౌలు సువార్తను రెండు సత్యాలుగా నిర్వచిస్తాడు: యేసు మన పాపాల కొరకు మరణించాడు (ఆయన సమాధి చేయబడటం ద్వారా నిరూపించబడింది) మరియు ఆయన మూడవ రోజున తిరిగి లేచాడు (అనేక సాక్షులకు ఆయన ప్రత్యక్షమవ్వడం ద్వారా నిరూపించబడింది). ఈ సువార్త సత్యం "అన్నింటికంటే ముఖ్యమైనది" (వచనం 3).
క్రీస్తు మరణాన్ని ఆయన పునరుత్థానంతో వేరు చేయడం అసాధ్యం. రెండింటిలో ఒకదానిని నమ్మకుండా మరొకదానిని నమ్మడం, రక్షణను ఇవ్వలేని ఒక అబద్ధ సువార్తను నమ్మడమే అవుతుంది. యేసు నిజంగా మృతులలో నుండి పునరుత్థానం పొందాలంటే, ఆయన నిజంగానే మరణించి ఉండాలి. మరియు ఆయన మరణానికి మన కోసం ఒక నిజమైన అర్థం ఉండాలంటే, ఆయనకు నిజమైన పునరుత్థానం ఉండాలి. రెండింటిలో ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు.
English
క్రైస్తవ విశ్వాసంలో ఏది ఎక్కువ ముఖ్యమైనది, క్రీస్తు మరణమా లేక ఆయన పునరుత్థానమా?