ప్రశ్న
బలి వ్యవస్థకు రక్త బలి ఎందుకు అవసరమైంది?
జవాబు
పాత నిబంధన మొత్తం, ప్రతి పుస్తకం, రాబోయే గొప్ప త్యాగాన్ని సూచిస్తుంది—అదే, మన కొరకు యేసు తన సొంత జీవితాన్ని త్యాగం చేయడం. బలి పద్ధతిలో రక్తం యొక్క ప్రాముఖ్యత గురించి పాత నిబంధన యొక్క కేంద్ర ప్రకటన లేవీయకాండము 17:11. మోషేతో మాట్లాడుతూ దేవుడు ఇలా ప్రకటిస్తున్నాడు: "ఎందుకంటే జీవుని ప్రాణం రక్తములో ఉన్నది, మరియు మీరు మీకొరకు బలిపీఠము మీద ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు నేను దానిని మీకు ఇచ్చియున్నాను; ప్రాణమునకు ప్రాయశ్చిత్తము చేయునది రక్తమే."
ఒక "బలి" అంటే ఒక కారణం లేదా ఉద్దేశ్యం కోసం విలువైన దానిని అర్పించడం అని నిర్వచించబడింది. ప్రాయశ్చిత్తం చేయడం అంటే చేసిన తప్పుకు గాను ఎవరినైనా లేదా దేన్నైనా సంతృప్తి పరచడం. లేవీయకాండములోని వాక్యమును ఇప్పుడు మరింత స్పష్టంగా చదవవచ్చు: దేవుడు ఇలా చెప్పాడు, "మీరు చేసిన అతిక్రమమును కప్పిపుచ్చుకొని, మీకొరకు ప్రాయశ్చిత్తము చేసుకొనుటకు (జీవి జీవము దాని రక్తములో ఉన్నది) దానిని మీకు ఇచ్చియున్నాను." మరో మాటలో చెప్పాలంటే, రక్తబలి ద్వారా కప్పబడిన వారు పాపము యొక్క పరిణామముల నుండి విడుదల పొందుతారు.
నిశ్చయంగా, ఇశ్రాయేలీయులకు యేసు గురించి ప్రత్యక్షంగా తెలియదు, లేదా ఆయన తమ కొరకు ఎలా మరణించి తిరిగి లేస్తారో కూడా తెలియదు, కానీ దేవుడు తమకు ఒక రక్షకుడిని పంపుతాడని వారు నమ్మారు. పాత నిబంధనలో కనిపించే అనేక రక్త బలిదానాలు, రాబోయే నిజమైన, ఒకేసారి జరిగే బలిదానానికి ముందస్తు సూచనలుగా ఉన్నాయి, తద్వారా రక్తం లేకుండా క్షమాపణ లేదనే విషయాన్ని ఇశ్రాయేలీయులు ఎప్పటికీ మరచిపోకుండా ఉండేలా చేయడం. ఈ రక్తపాతం ఒక ప్రత్యామ్నాయ చర్య. కాబట్టి, లేవీయకాండము 17:11లోని చివరి భాగాన్ని ఇలా చదవవచ్చు: రక్తం ప్రాణం (అంటే, జంతువు ప్రాణం) మూల్యంగా ప్రాయశ్చిత్తం చేస్తుంది లేదా ప్రాణం స్థానంలో (అంటే, పాపి ప్రాణం, యేసు క్రీస్తు తన చిందించిన రక్తం ద్వారా జీవాన్ని ఇచ్చేవాడు) ప్రాయశ్చిత్తం చేస్తుంది.
హెబ్రీయులు 9:11-18 రక్తం జీవమునకు ప్రతీక అని ధృవీకరిస్తుంది మరియు లేవీయకాండము 17:11ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలికి వర్తింపజేస్తుంది. 12వ వచనం ప్రకారం, పాత నిబంధనలోని రక్త బలిదానాలు తాత్కాలికమైనవని, అవి పాపమును పాక్షికంగా మరియు కొద్ది కాలం పాటు మాత్రమే క్షమించాయని స్పష్టంగా చెబుతుంది, అందుకే బలిదానాలను ప్రతి సంవత్సరం పునరావృతం చేయవలసిన అవసరం ఏర్పడింది. కానీ క్రీస్తు పరమపవిత్ర స్థలంలోకి ప్రవేశించినప్పుడు, ఆయన తన సొంత రక్తాన్ని సర్వకాల సర్వాంతరాలకు ఒకేసారి అర్పించారు, దీనివల్ల భవిష్యత్తులో బలిదానాల అవసరం లేకుండా పోయింది. సిలువ మీద తన చివరి మాటలలో యేసు చెప్పిన "సిద్ధమైంది" (యోహాను 19:30) అనే వాక్యానికి అర్థం ఇదే. ఇకపై ఎన్నటికీ ఎద్దుల యొక్క, మేకల యొక్క రక్తం మనుష్యులను వారి పాపముల నుండి శుద్ధిపరచలేదు. పాపక్షమానికి సిలువ మీద చిందించబడిన యేసు రక్తాన్ని అంగీకరించడం ద్వారా మాత్రమే, మనం క్రీస్తు నీతితో కప్పబడి దేవుని యెదుట నిలబడగలం (2 కొరింథీయులు 5:21).
English
బలి వ్యవస్థకు రక్త బలి ఎందుకు అవసరమైంది?