settings icon
share icon
ప్రశ్న

పవిత్ర దేవదూతలు పరిపూర్ణులా, లేదా వారు కొన్నిసార్లు దేవుని విఫలం చేస్తారా?

జవాబు


దేవదూతలు దేవుని పని చేస్తున్న అనేక కథనాలు లేఖనాలలో ఉన్నాయి. విశ్వాసులను కాపాడటానికి (కీర్తనలు 91:11; మత్తయి 4:6), మానవాళికి సందేశాలను తీసుకువెళ్ళడానికి (మత్తయి 1:20; లూకా 1:26–28; దానియేలు 9:20–23), మరియు భూమిని తీర్పు తీర్చడంలో సహాయం చేస్తారు (మత్తయి 13:39–49). దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తారు మరియు విశ్వాసుల కొరకు మధ్యవర్తిత్వం చేస్తారు (కీర్తనలు 148:2; మత్తయి 18:10), కానీ వారు సర్వజ్ఞులు కారు (మత్తయి 24:36). వారు దేవుని ఆజ్ఞను నెరవేర్చి, ఆయన వాక్యానికి విధేయత చూపే శక్తివంతమైన జీవులుగా వర్ణించబడ్డారు (కీర్తనలు 103:20). దేవుడు పరిపూర్ణుడని (మత్తయి 5:48) మరియు ఆయన సన్నిధిలో అపరిపూర్ణమైనది ఏదీ నివసించలేదని మనకు తెలుసు. దేవదూతలు ఆయన సన్నిధిలో నివసిస్తున్నారని (మత్తయి 18:10) మనకు తెలిసినందున, పరిశుద్ధ దేవదూతలు నిజంగా పరిపూర్ణులని మనం భావించవచ్చు. యేసు వారిని "పవిత్ర దూతలు" అని ఒక కారణంతో పిలుస్తారు (లూకా 9:26).

యోబు గ్రంథంలో దూతలు పరిపూర్ణులు అనే భావనకు విరుద్ధంగా కనిపించే రెండు భాగాలు ఉన్నాయి. మొదటిది యోబు 4:18, మరియు రెండవది యోబు 15:15. ఈ రెండు వాక్యాలు, యోబు దురదృష్టాలను అర్థం చేసుకోవడంలో అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న అతని స్నేహితుడు ఎలిఫాజు ఇచ్చిన రెండు వేర్వేరు ప్రసంగాలలో భాగం. యోబు దేవునియందు భయభక్తులు కలిగి, నిష్కళంకంగా జీవించిన నీతిమంతుడు (యోబు 1:1). అందువల్ల, అతను అనుభవించిన అనేక విషాదాలు అతని మతపరమైన స్నేహితుల మనసుకు చాలా వింతగా అనిపించాయి, ఎందుకంటే దేవుడు మంచివారికి ఆనందకరమైన విషయాలను మరియు చెడ్డవారికి బాధాకరమైన విషయాలను బహుమతిగా ఇస్తాడని వారు భావించారు. ఆ తప్పు భావన నుండి, అతని జీవితంలోని పాపమే అతని బాధ మరియు విషాదానికి కారణమని వారు యోబుతో చెప్పారు. యోబు తాను నిర్దోషినని వాదించినప్పుడు, అతని స్నేహితులు అతనిని సందేహించారు.

అప్పుడు ఎలిఫాజు ముందుకు వచ్చి, దేవదూతలను సాక్ష్యంగా ఉపయోగిస్తూ, యోబు నిర్దోషిత్వానికి వ్యతిరేకంగా వాదిస్తాడు: "దేవుడు... తన దూతలలో దోషమును ఆరోపిస్తే, మట్టి గృహములలో నివసించువారి విషయములో ఎంతమించకపోయినది?" (యోబు 4:18–19). మరో మాటలో చెప్పాలంటే, దేవుని ముందు దేవదూతలు కూడా తప్పు చేసినప్పుడు, మనుషులు నిర్దోషులుగా జీవించడం ఖచ్చితంగా అసాధ్యం! ఎలిఫాజు యోబుతో చేసిన మరో ప్రసంగంలో, అతను అదే విషయాన్ని పునరావృతం చేస్తాడు: "దేవుడు తన పరిశుద్ధులయందు నమ్మకముంచడు, ఆయన దృష్టికి ఆకాశములును శుద్ధములు కావు గదా? అసహ్యులగు, పాడుబడిన మనుష్యులు ఇంకెంత అల్పులు?" (యోబు 15:15–16).

మనం గుర్తుంచుకోవలసినవి రెండు విషయాలు ఉన్నాయి. మొదటిది, ఎలిఫాజు సత్యం చెప్పేవాడు కాదు. నిజానికి, యోబుగ్రంథం చివర, ప్రభువు స్వయంగా ప్రత్యక్షమైనప్పుడు, మనం ఇలా చదువుతాము: "[దేవుడు] తెమనీయుడైన ఎలిఫాజుతో, 'నా విషయంలో మీరు సత్యము మాటలాడలేదు గనుక నేను మీ మీదను, మీ స్నేహితులిద్దరి మీదను కోపగించియున్నాను'" (యోబు 42:7). అందువల్ల, యోబు పుస్తకంలో ఎవరు మాట్లాడుతున్నారో ఎల్లప్పుడూ తెలుసుకోవడం ముఖ్యం. ఎలిఫాజుమరియు యోబు స్నేహితులైన మరో ఇద్దరి మాటలు నమ్మదగినవి కావు.

రెండవదిగా, యోబు 4:18కు ముందు వాక్యాలలో, ఎలిఫాజుకు తన సమాచారం రాత్రి తనను సందర్శించిన ఒక ఆత్మ నుండి లభించిందని మనం చూస్తాము (యోబు 4:12–16). ఈ ఆత్మ, పరిశుద్ధ దూతలు దానియేలు, మరియ లేదా యోసేపులకు కనపడిన విధంగా ఎలిఫాజుకు కనపడలేదు. పవిత్ర దేవదూతలు వెలుగులో వచ్చారు, తమ సందేశాలు దేవుని నుండి వచ్చాయని ప్రకటించారు, మరియు తాము సందర్శించిన మనుషులతో భయపడవద్దని చెప్పారు. మరోవైపు, ఎలిఫాజుకు కనిపించిన ఆ ఆత్మ అతన్ని భయపెట్టింది, చీకటిలో దాక్కొంది, మరియు అతని చెవిలో గుసగుసలాడింది. ఎలిఫాజుకు ప్రత్యక్షమైన ఆత్మ ఒక దెయ్యం అని, అనగా పరిశుద్ధ దేవునిచే తప్పుగా ఆరోపించబడినందుకు తన చేదును వ్యక్తపరుస్తున్న ఒక పతనమైన దేవదూత అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

యోబు గ్రంథంలోని ఈ రెండు భాగాలు, మొదటి చూపులో పరిశుద్ధ దేవదూతల భావనకు విరుద్ధంగా కనిపించినప్పటికీ, అవి దేవుని దేవదూతల అసంపూర్ణతను నిరూపించవు. దానికి బదులుగా, అవి మనిషి యొక్క అపరిపూర్ణతను నిరూపిస్తాయి, అతను సులభంగా మోసపోతాడు మరియు తన సొంత బలహీనమైన మేధస్సుపై ఆధారపడకుండా ఎల్లప్పుడూ దేవుని నుండి జ్ఞానాన్ని అడగాలి (సామెతలు 3:5–6; యాకోబు 1:5 చూడండి).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పవిత్ర దేవదూతలు పరిపూర్ణులా, లేదా వారు కొన్నిసార్లు దేవుని విఫలం చేస్తారా?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries