settings icon
share icon
ప్రశ్న

యేసు క్రీస్తు శారీరక పునరుత్థానం యొక్క సత్యం ఎందుకు అంత ముఖ్యమైనది?

జవాబు


యేసు క్రీస్తు శారీరక పునరుత్థానం చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన సంఘటన, ఇది యేసు తాను చెప్పుకున్నట్లుగా దేవుని కుమారుడని తిరుగులేని రుజువును అందిస్తుంది. పునరుత్థానం ఆయన దైవత్వానికి అత్యున్నతమైన ధృవీకరణ మాత్రమే కాదు; అది ఆయన రాకడను మరియు పునరుత్థానాన్ని ముందుగా తెలియజేసిన లేఖనాలను కూడా ధృవీకరించింది. అంతేకాకుండా, మూడవ రోజున తాను లేపబడతానని క్రీస్తు చేసిన వాదనలను (యోహాను 2:19-21; మార్కు 8:31; 9:31; 10:34) అది ధృవీకరించింది. క్రీస్తు శరీరం మృతులలో నుండి పునరుత్థానం కాకపోతే, మన శరీరాలు కూడా పునరుత్థానం అవుతాయనే మనకు ఆశ లేదు (1 కొరింథీయులు 15:13, 16). నిజానికి, క్రీస్తు శారీరక పునరుత్థానం లేకుండా, మనకు రక్షకుడు లేడు, రక్షణ లేదు, మరియు నిత్యజీవపు ఆశ లేదు. అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా, మన విశ్వాసం "ప్రయోజనరహితమైనది" అవుతుంది మరియు సువార్త యొక్క జీవమిచ్చే శక్తి పూర్తిగా తొలగిపోతుంది.

ఎందుకంటే మన శాశ్వతమైన గమ్యం ఈ చారిత్రక సంఘటన యొక్క సత్యంపై ఆధారపడి ఉన్నందున, పునరుత్థానం సంఘంపై సైతాను యొక్క గొప్ప దాడులకు లక్ష్యంగా ఉంది. అందువల్ల, శతాబ్దాలుగా లెక్కలేనంత మంది పండితులు, వేదాంతులు, ప్రొఫెసర్లు మరియు ఇతరులు క్రీస్తు శారీరక పునరుత్థానం యొక్క చారిత్రకతను అన్ని కోణాల నుండి పరిశీలించి, పరిశోధించి, అంతులేకుండా అధ్యయనం చేశారు. మరియు ఈ గొప్ప సంఘటనను తప్పు అని నిరూపించడానికి అనేక సిద్ధాంతాలు ప్రతిపాదించబడినప్పటికీ, ఆయన అక్షరాలా శారీరకంగా పునరుత్థానం కావడం తప్ప మరేదైనా ధృవీకరించే విశ్వసనీయమైన చారిత్రక సాక్ష్యం ఏదీ లేదు. మరోవైపు, యేసు క్రీస్తు శారీరక పునరుత్థానానికి సంబంధించిన స్పష్టమైన మరియు నమ్మదగిన సాక్ష్యం అపారంగా ఉంది.

అయినప్పటికీ, ప్రాచీన కొరింథులోని క్రైస్తవుల నుండి నేటి అనేకమంది వరకు, మన రక్షకుని పునరుత్థానం యొక్క కొన్ని అంశాలకు సంబంధించి అపార్థాలు కొనసాగుతున్నాయి. క్రీస్తు శరీరం పునరుత్థానం కావడం ఎందుకు ముఖ్యం అని కొందరు అడుగుతారు? ఆయన పునరుత్థానం కేవలం ఆత్మీయమైనదిగా ఉండగలిగి ఉండేదా? యేసు క్రీస్తు పునరుత్థానం విశ్వాసుల శారీరక పునరుత్థానానికి ఎలా మరియు ఎందుకు హామీ ఇస్తుంది? మన పునరుత్థాన శరీరాలు మన ఈ భౌతిక శరీరాల వలెనే ఉంటాయా? ఒకవేళ కాకపోతే, అవి ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు, పౌలు తన రెండవ మిషనరీ ప్రయాణంలో కొన్ని సంవత్సరాల క్రితం స్థాపించిన కొరింథు సంఘానికి రాసిన మొదటి లేఖలోని పదిహేడవ అధ్యాయంలో కనిపిస్తాయి.

యువ కొరింథీ సంఘంలో వర్గాలు పెరగడంతో పాటు, పునరుత్థానం సహా కొన్ని ముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాల గురించి తీవ్రమైన అపార్థాలు వ్యాపించి ఉన్నాయి. చాలా మంది కొరింథీయులు క్రీస్తు పునరుత్థానం చెందాడని అంగీకరించినప్పటికీ (1 కొరింథీయులు 15:1, 11), ఇతరులు కూడా పునరుత్థానం చెందగలరని లేదా చెందుతారని నమ్మడానికి వారికి కష్టంగా ఉండేది. ఆధ్యాత్మికమైనది అంతా మంచిదని, అయితే మన శరీరాల వంటి భౌతికమైనది అంతా అంతర్గతంగా చెడ్డదని భావించిన గ్నోస్టిక్ తత్వశాస్త్రం యొక్క నిరంతర ప్రభావమే, వారి స్వంత పునరుత్థానం గురించిన వారి గందరగోళానికి ముఖ్య కారణం. అందువల్ల, ఒక అసహ్యకరమైన శవము శాశ్వతంగా పునరుత్థానం అవుతుందనే ఆలోచనను కొందరు, మరియు ఆ కాలంలోని గ్రీకు తత్వవేత్తలు తీవ్రంగా వ్యతిరేకించారు (అపొస్తలుల కార్యములు 17:32).

అయినప్పటికీ, కొరింథీయులలో చాలామంది క్రీస్తు పునరుత్థానం శారీరకమైనదే కానీ ఆత్మీయమైనది కాదని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే, పునరుత్థానం అంటే "చనిపోయిన వారిలో నుండి లేవడం"; అంటే ఏదైనా తిరిగి జీవితంలోకి రావడం. అన్ని ఆత్మలు అమరమైనవని మరియు మరణించిన వెంటనే ప్రభువుతో ఉన్నాయని వారు అర్థం చేసుకున్నారు (2 కొరింథీయులు 5:8). అందువల్ల, "ఆత్మీయ" పునరుత్థానానికి అర్థం ఉండదు, ఎందుకంటే ఆత్మ చనిపోదు మరియు అందువల్ల దానికి పునరుత్థానం ఉండదు. అంతేకాకుండా, లేఖనాలలో, అలాగే క్రీస్తు స్వయంగా, ఆయన శరీరం మూడవ రోజున తిరిగి లేస్తుందని చెప్పారని వారికి తెలుసు. క్రీస్తు శరీరం క్షయం చెందదని కూడా లేఖనము స్పష్టంగా తెలిపింది (కీర్తనలు 16:10; అపొస్తలుల కార్యములు 2:27). ఒకవేళ ఆయన శరీరం పునరుత్థానం కాకపోతే, ఈ వాక్యం అర్థరహితమవుతుంది. చివరగా, క్రీస్తు తన శిష్యులతో తన శరీరమే పునరుత్థానం అయిందని నొక్కి చెప్పాడు: "నా చేతులను నా పాదములను చూడుడి; నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలును మాంసమును భూతమునకు ఉండవు" (లూకా 24:39).

అయినప్పటికీ, కొరింథీయుల ఆందోళన వారి వ్యక్తిగత పునరుత్థానం గురించే. అందువల్ల, క్రీస్తు మృతులలో నుండి పునరుత్థానం చెందినందున, వారు కూడా ఏదో ఒక రోజు మృతులలో నుండి పునరుత్థానం చెందుతారని, మరియు క్రీస్తు పునరుత్థానం, మన పునరుత్థానం అనే ఈ రెండూ కలిసి నిలవాలి లేదా విఫలమవ్వాలని పౌలు కొరింథీయులకు నమ్మించడానికి ప్రయత్నించాడు, ఎందుకంటే, "మృతుల పునరుత్థానము లేనియెడల, క్రీస్తుకూడ లేపబడి యుండలేదు" (1 కొరింథీయులు 15:13).

కాని క్రీస్తు నిజముగా మృతులలోనుండి లేపబడియున్నాడు, నిద్రించినవారిలో ప్రథమఫలము. ఏలయనగా మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” (1 కొరింథీయులు 15:20-22).

యేసు క్రీస్తు పునరుత్థానం అయినప్పుడు, ఆయన లేపబడబోయే వారందరికి "మొదటి కాపు"గా అయ్యారు (కొలొస్సయులు 1:18 కూడా చూడండి). ఇశ్రాయేలీయులు తమ పంటలలో ఒక ప్రాతినిధ్య నమూనాను (మొదటి కాపును) కర్తకు బలిగా యాజకుల దగ్గరకు తీసుకువచ్చే వరకు తమ పంటను పూర్తిగా కోయలేకపోయేవారు (లేవీయకాండము 23:10). 1 కొరింథీయులు 15:20-22లో పౌలు చెబుతున్నది ఇదే; విశ్వాసంతో మరణించిన వారి పునరుత్థాన "పంట"కు క్రీస్తు సొంత పునరుత్థానమే "మొదటి కాయలు". పౌలు ఉపయోగించిన "మొదటి కాయలు" అనే భాష, దాని తర్వాత ఏదో రాబోతోందని సూచిస్తుంది, మరియు అది ఆయన అనుచరులు - మిగిలిన "పంట". ఈ విధంగా క్రీస్తు పునరుత్థానం మన పునరుత్థానానికి హామీ ఇస్తుంది. నిజానికి, ఆయన పునరుత్థానానికి మన పునరుత్థానం అవసరం.

ఆత్మను అవాంఛనీయమైన శరీరానికి అనుసంధానించడం గురించి వారి ఆందోళనలను తొలగించడానికి, పౌలు వారికి మన పునరుత్థాన శరీరాల స్వభావాన్ని మరియు అవి మన భౌతిక శరీరాల నుండి ఎలా భిన్నంగా ఉంటాయో వివరించాడు. పౌలు మన మరణించిన భౌతిక శరీరాలను ఒక "విత్తనానికి" పోల్చాడు, మరియు దేవుడు చివరికి మరొక శరీరాన్ని (1 కొరింథీయులు 15:37-38) అందిస్తాడని, అది క్రీస్తు యొక్క మహిమాన్వితమైన పునరుత్థాన శరీరం వలె ఉంటుందని (1 కొరింథీయులు 15:49; ఫిలిప్పీయులు 3:21). నిజంగా, మన ప్రభువు విషయంలో జరిగినట్లే, ఇప్పుడు క్షయమయ్యే, అగౌరవమైన, బలహీనమైన మరియు భౌతికమైన మన శరీరాలు ఒక రోజు క్షయములేని, మహిమానవని, శక్తివంతమైన మరియు ఆత్మీయమైన శరీరములుగా లేపబడతాయి (1 కొరింథీయులు 15:42-44). మన ఆత్మీయ శరీరాలు పరలోక సంబంధమైన, అతీంద్రియ జీవనానికి సంపూర్ణంగా సన్నద్ధమై ఉంటాయి.

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

యేసు క్రీస్తు శారీరక పునరుత్థానం యొక్క సత్యం ఎందుకు అంత ముఖ్యమైనది?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries