ప్రశ్న
యేసు క్రీస్తు పరలోకారోహణ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు
యేసు మృతులలో నుండి తిరిగి లేచిన తర్వాత, ఆయన సమాధి దగ్గర ఉన్న స్త్రీలకు (మత్తయి 28:9-10), తన శిష్యులకు (లూకా 24:36-43), మరియు 500 మందికి పైగా ఇతరులకు (1 కొరింథీయులు 15:6) "తాను బ్రతికి ఉన్నానని" ప్రత్యక్షమయ్యారు. ఆయన పునరుత్థానం తర్వాత రోజులలో, యేసు తన శిష్యులకు దేవుని రాజ్యమునుగూర్చి బోధించెను (అపోస్తలుల కార్యములు 1:3).
పునరుత్థానం జరిగిన నలభై రోజుల తర్వాత, యేసు తన శిష్యులతో కలిసి యెరూషలేముకు సమీపంలో ఉన్న ఒలివెత్ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ, త్వరలోనే పరిశుద్ధాత్మను పొందుతారని యేసు తన అనుచరులకు వాగ్దానం చేశాడు, మరియు ఆత్మ వచ్చే వరకు యెరూషలేములోనే ఉండమని వారికి ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత యేసు వారిని ఆశీర్వదించాడు, మరియు ఆశీర్వాదం ఇస్తున్నప్పుడు, ఆయన స్వర్గంలోకి ఆరోహణుడయ్యాడు. యేసు ఆరోహణము గురించిన వృత్తాంతం లూకా 24:50-51 మరియు అపోస్తలుల కార్యములు 1:9-11లో కనిపిస్తుంది.
యేసు పరలోకారోహణ ఆయన యొక్క అక్షరమైన, శారీరకమైన తిరిగి వెళ్ళడం అని లేఖనాల నుండి స్పష్టమవుతుంది. ఆయన అనేకమంది నిబ్బరంగా చూస్తుండగా, నెమ్మదిగా, కంటికి కనిపించేలా భూమి నుండి పైకి లేచారు. శిష్యులు యేసును చివరిసారిగా చూడటానికి తహతహలాడుతుండగా, ఒక మేఘం ఆయనను వారి దృష్టికి అందనివ్వకుండా కప్పివేసింది, మరియు ఇద్దరు దేవదూతలు ప్రత్యక్షమై, "గలీలయవాసులారా, ఆకాశమునకు చూచుచు ఎందుకు నిలిచియున్నారు? మీరు ఆయనను ఆకాశమునకు వెళ్లిపోవుట చూచినట్లు ఆయన మరల వచ్చును" అని వాగ్దానం చేశారు (అపోస్తలుల కార్యములు 1:11).
యేసు క్రీస్తు పరలోకారోహణ అనేక కారణాల వల్ల అర్థవంతమైనది:
1) ఇది ఆయన భూలోక పరిచర్య ముగింపుకు సంకేతం ఇచ్చింది. దేవుడైన తండ్రి ప్రేమతో తన కుమారుని బెత్లెహేములో లోకంలోకి పంపాడు, మరియు ఇప్పుడు కుమారుడు తండ్రి వద్దకు తిరిగి వెళ్తున్నాడు. మానవ పరిమితి కాలం ముగిసింది.
2) ఇది ఆయన భూలోక పరిచర్యలో విజయాన్ని సూచించింది. ఆయన ఏమి చేయడానికి వచ్చారో, అదంతా ఆయన నెరవేర్చారు.
3) ఇది ఆయన పరలోక మహిమ యొక్క పునరాగమనాన్ని సూచించింది. యేసు భూమిపై ఉన్నంత కాలం ఆయన మహిమ మరుగుపరచబడింది, రూపాంతరములో (మత్తయి 17:1-9) ఒక చిన్న మినహాయింపుతో.
4) ఇది తండ్రి ద్వారా ఆయన పొందిన ఉన్నతీకరణకు ప్రతీకగా నిలిచింది (ఎఫెసయులు 1:20-23). తండ్రికి సంప్రీతి కలిగిన ఆయన (మత్తయి 17:5) గౌరవంతో పరలోకమునకు చేర్చబడి, సర్వ నామముల కంటే ఉన్నతమైన నామము ప్రసాదించబడింది (ఫిలిప్పీయులు 2:9).
5) ఆయన మనకొరకు స్థలాన్ని సిద్ధపరచడానికి (యోహాను 14:2) అది ఆయనకు అనుమతించింది.
6) ఇది ఆయన యెత్తు ప్రధాన యాజకునిగా (హెబ్రీయులు 4:14-16) మరియు నూతన నిబంధనకు మధ్యవర్తిగా (హెబ్రీయులు 9:15) తన నూతన పరిచర్య ప్రారంభాన్ని సూచించింది.
7) అది ఆయన తిరిగి రావడానికి నమూనాను నిర్దేశించింది. యేసు రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చినప్పుడు, ఆయన వెళ్ళినట్లే తిరిగి వస్తాడు - అక్షరాలా, శారీరకంగా, మరియు మేఘాలలో కంటికి కనిపించేలా (అపొస్తలుల కార్యములు 1:11; దానియేలు 7:13-14; మత్తయి 24:30; ప్రకటన 1:7).
ప్రస్తుతం, ప్రభువైన యేసు పరలోకంలో ఉన్నారు. లేఖనములు ఆయనను తండ్రి కుడి పార్శ్వమున ఉన్నట్లు తరచుగా చిత్రీకరిస్తాయి - ఇది గౌరవము మరియు అధికారము గల స్థానము (కీర్తనలు 110:1; ఎఫెసయులు 1:20; హెబ్రీయులు 8:1). క్రీస్తు సంఘానికి తల (కొలొస్సయులు 1:18), ఆత్మీయ వరములను ఇచ్చువాడు (ఎఫెసయులు 4:7-8), మరియు సర్వమునందు సర్వమును నింపువాడు (ఎఫెసయులు 4:9-10).
English
యేసు క్రీస్తు పరలోకారోహణ యొక్క అర్థం మరియు ప్రాముఖ్యత ఏమిటి?