settings icon
share icon
ప్రశ్న

పస్కా గొఱ్ఱెపిల్ల ఎవరు? యేసు మన పస్కా గొఱ్ఱెపిల్లగా ఎలా ఉన్నారు?

జవాబు


దేవుడు ప్రతి ఇంటి మొదటి సంతానాన్ని చంపిన ఆ భయంకరమైన రాత్రి, ఈజిప్టులో బలిగా అర్పించమని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన జంతువు పస్కా గొర్రెపిల్ల (నిర్గమకాండము 12:29). ఇది ఫరో మీద దేవుడు పంపిన చివరి తెగులు, మరియు అది ఫరో ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడుదల చేయడానికి దారితీసింది (నిర్గమకాండము 11:1). ఆ ఘోరమైన రాత్రి తర్వాత, శాశ్వత జ్ఞాపకార్థం పస్కా పండుగను ఆచరించమని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 12:14).

దేవుడు ఇశ్రాయేలీయుల ప్రతి ఇంటివారు లోపరహితమైన ఒక సంవత్సరం గొర్రెపిల్లను ఎంచుకోవాలని ఆజ్ఞాపించాడు (నిర్గమకాండము 12:5; చూ. లేవీయకాండము 22:20-21). ఆ ఇంటి యజమాని సంధ్యా సమయంలో ఆ గొర్రెపిల్లను వధించి, దాని ఎముకలలో ఏదీ విరగకుండా జాగ్రత్త వహించాలి, మరియు దాని రక్తంలో కొంత తీసుకుని ఇంటి ద్వారబంధం యొక్క పైభాగమునకు మరియు పక్కలకు పూయాలి. ఆ గొర్రెపిల్లను కాల్చి తినవలసియుండెను (నిర్గమకాండము 12:7-8). ఇశ్రాయేలీయులు ఆ గొర్రెపిల్లను ఎలా తినవలసిందో అని దేవుడు నిర్దిష్టమైన ఆదేశాలను కూడా ఇచ్చాడు, "మీ నడుముకు మీ పైవస్త్రము బిగించుకొని, పాదములకు పాదరక్షలు ధరించి, చేతిలో మీ దండను పట్టుకొని" (నిర్గమకాండము 12:11). మరో మాటలో చెప్పాలంటే, వారు ప్రయాణానికి సిద్ధంగా ఉండవలసియుండెను.

దేవుడు ఇంటి ద్వారబంధం మీద గొర్రెపిల్ల రక్తాన్ని చూసినప్పుడు, ఆ ఇంటిని "తప్పించుకుని" వెళ్తానని మరియు "వినాశకుడిని" (నిర్గమకాండము 12:23) ప్రవేశించడానికి అనుమతించనని చెప్పాడు. గొర్రెపిల్ల రక్తం లేని ఏ ఇంట్లోనైనా ఆ రాత్రి వారి మొదటి కుమారుడు చంపబడతాడని (నిర్గమకాండము 12:12-13) చెప్పబడింది.

కొత్త నిబంధన ఈ నమూనా పస్కా గొర్రెపిల్లకు మరియు పరిపూర్ణమైన పస్కా గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుకు మధ్య సంబంధాన్ని స్థాపిస్తుంది (1 కొరింథీయులు 5:7). ప్రవక్త అయిన బాప్తిస్మం యోహాను యేసును "లోక పాపమును మోసికొనిపోయే గొఱ్ఱెపిల్ల"గా గుర్తించాడు (యోహాను 1:29), మరియు అపొస్తలుడైన పేతురు దోషరహితమైన గొఱ్ఱెపిల్లను (నిర్గమకాండము 12:5) క్రీస్తుతో ముడిపెడుతూ, ఆయనను "దోషము లేని, మచ్చ లేని గొఱ్ఱెపిల్ల" అని పిలుస్తాడు (1 పేతురు 1:19). యేసు "నిందారహితుడు" అని పిలవబడటానికి అర్హుడు, ఎందుకంటే ఆయన జీవితం పాపం నుండి పూర్తిగా స్వేచ్ఛగా ఉంది (హెబ్రీయులు 4:15). ప్రకటన గ్రంథంలో, అపొస్తలుడైన యోహాను యేసును "వధించబడినట్లుగా కనిపించే ఒక గొఱ్ఱెపిల్లగా" చూశాడు (ప్రకటన 5:6). పస్కా పండుగ జరుపుకునే సమయంలోనే యేసు శిలువ వేయబడ్డాడు (మార్కు 14:12).

విశ్వాసులు తమ హృదయాలపై క్రీస్తు యొక్క బలి రక్తాన్ని ప్రతీకాత్మకంగా పూసుకుని, తద్వారా నిత్య మరణం నుండి తప్పించుకున్నారని బైబిల్ చెబుతోంది (హెబ్రీయులు 9:12, 14). ఎలాగంటే, పస్కా పండుగకు పూసిన గొర్రెపిల్ల రక్తం "వినాశకుడిని" ప్రతి ఇంటిని దాటి వెళ్ళేలా చేసిందో, అలాగే క్రీస్తు పూసిన రక్తం పాపులపై దేవుని తీర్పును దాటి వెళ్ళేలా చేసి, విశ్వాసులకు జీవాన్ని ఇస్తుంది (రోమీయులు 6:23).

మొదటి పస్కాహారం ఐగుప్తు బానిసత్వం నుండి హెబ్రీయుల విడుదలను సూచించినట్లుగా, క్రీస్తు మరణం పాపపు బానిసత్వం నుండి మన విడుదలను సూచిస్తుంది (రోమీయులు 8:2). మొదటి పస్కాహారం వార్షిక పండుగగా జ్ఞాపకార్థం జరుపుకోవలసి ఉన్నట్లుగా, క్రీస్తు తిరిగి వచ్చే వరకు క్రైస్తవులు ప్రభువు మరణాన్ని సంఘములో జ్ఞాపకము చేసుకోవాలి (1 కొరింథీయులు 11:26).

పాత నిబంధనలోని పస్కా గొర్రెపిల్ల, ఆ కాలంలో ఒక వాస్తవమైనప్పటికీ, అది మరింత ఉత్తమమైన మరియు అంతిమ పస్కా గొర్రెపిల్ల అయిన యేసు క్రీస్తుకు ఒక ముందస్తు సూచన మాత్రమే. ఆయన పాపరహితమైన జీవితం మరియు త్యాగమయ మరణం ద్వారా, ప్రజలకు మరణం నుండి తప్పించుకోవడానికి ఒక మార్గాన్ని మరియు నిత్యజీవం యొక్క నిశ్చయమైన నిరీక్షణను ఇవ్వగల ఏకైక వ్యక్తిగా యేసు నిలిచారు (1 పేతురు 1:20-21).

English



తెలుగు హోం పేజికు వెళ్ళండి

పస్కా గొఱ్ఱెపిల్ల ఎవరు? యేసు మన పస్కా గొఱ్ఱెపిల్లగా ఎలా ఉన్నారు?
ఈ పేజీని భాగస్వామ్యం చేయండి: Facebook icon Twitter icon Pinterest icon Email icon
© Copyright Got Questions Ministries