ప్రశ్న
యేసు రెండవ ఆదాము / చివరి ఆదాము అని అనడంలో అర్థం ఏమిటి?
జవాబు
కొరింథు సంఘానికి రాసిన తన మొదటి పత్రికలో అపోస్తలుడైన పౌలు మనకు ఇలా చెబుతున్నారు, "మొదటి మనుష్యుడు ఆదాము జీవించు ప్రాణి అయ్యెను; కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ అయ్యెను. ఆత్మసంబంధమైనది ముందుగా రాలేదు, సహజమైనది ముందుగా ఉంది, ఆ తర్వాత ఆత్మసంబంధమైనది. మొదటి మనుష్యుడు భూమి యొక్క ధూళితో ఏర్పడెను, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చెను. భౌతికమైన మనుష్యుడు ఎలాగో, భూమికి చెందిన వారు కూడా అలాగే ఉన్నారు; మరియు పరలోక మనుష్యుడు ఎలాగో, పరలోకమునకు చెందిన వారు కూడా అలాగే ఉంటారు. మరియు భౌతికమైన మనుష్యుని స్వరూపాన్ని మనం ఎలాగైతే ధరించామో, పరలోక మనుష్యుని స్వరూపాన్ని కూడా అలాగే ధరిస్తాము" (1 కొరింథీయులకు 15:45-49).
పౌలు ఇక్కడ రెండు రకాల శరీరాల మధ్య ఉన్న తేడాను సూచిస్తున్నారు, అవి: సహజమైనది మరియు ఆత్మీయమైనది. ఆదికాండము 2:7 ప్రకారం, మొదటి మనిషి అయిన ఆదాము జీవముగల వ్యక్తిగా అయ్యాడు. ఆదాము భూమి యొక్క ధూళితో చేయబడి, దేవుని నుండి జీవశ్వాసము పొందాడు. అప్పటి నుండి ప్రతి మనిషికి ఇవే లక్షణాలు ఉంటాయి. అయితే, చివరి ఆదాము లేదా "రెండవ ఆదాము" - అనగా క్రీస్తు - జీవాన్నిచ్చే ఆత్మ. ఆదాము మానవ జాతికి మొదటివాడుగా ఉన్నట్లుగా, క్రీస్తు చనిపోయిన వారిలో నుండి నిత్యజీవం కొరకు లేపబడిన వారికి మొదటివాడు. క్రీస్తు చనిపోయిన వారిలో నుండి లేచినందున, ఆయన "జీవమును ఇచ్చు ఆత్మ"గా ఒక కొత్త అస్తిత్వ రూపంలోకి ప్రవేశించాడు. విశ్వాసుల పునరుత్థానానికి దారితీసే ఆత్మీయ జీవమునకు ఆయననే మూలం. ఆదాము యొక్క మానవ శరీరం అతని సహజ జీవితానికి అనువైనదిగా ఉన్నట్లే, క్రీస్తు యొక్క కొత్త మహిమపరచబడిన మానవ శరీరం ఇప్పుడు ఆయన యొక్క కొత్త, మహిమపరచబడిన, ఆత్మీయ జీవితానికి అనువుగా ఉంది. విశ్వాసులు పునరుత్థానం అయినప్పుడు, దేవుడు వారికి నిత్య జీవితానికి తగిన, రూపాంతరం చెందిన, నిత్యమైన శరీరాలను ఇస్తాడు.
46వ వచనంలో పౌలు మనకు చెబుతున్నదేమిటంటే, సహజమైనవాడు మొదట వచ్చాడని, ఆ తర్వాత ఆత్మీయుడు వచ్చాడని. మనుషులు మొదట సహజ జీవితాన్ని పొందుతారు; అంటే, వారు ఈ భూమిలో జన్మించి ఇక్కడ జీవిస్తారు. అక్కడి నుండి మాత్రమే వారు ఆత్మీయ జీవితాన్ని పొందుతారు. సహజ మనుష్యుడైన ఆదాము ఈ భూమిపైకి మొదట వచ్చాడని, అతడు భూమి యొక్క ధూళితో సృష్టించబడ్డాడని పౌలు మనకు చెబుతున్నాడు. క్రీస్తు నిత్యత్వం నుండి ఉన్నాడనేది నిజమే అయినప్పటికీ, ఆదాము తర్వాత చాలా సంవత్సరాలకు పరలోకం నుండి భూమికి వచ్చినందున ఆయనను ఇక్కడ రెండవ మనుష్యుడు లేదా రెండవ ఆదాము అని పిలుస్తారు. క్రీస్తు అందరు మనుషుల వలె శరీరంతో ఒక మానవ శిశువుగా వచ్చాడు, కానీ ఆదాములా ఆయన భూమి యొక్క ధూళి నుండి ఉద్భవించలేదు. ఆయన "పరలోకం నుండి వచ్చాడు."
ఆ తర్వాత పౌలు ఇలా చెబుతున్నాడు: "భూసంబంధమైన మనుష్యుడు [ఆదాము] ఎలాగో, భూమికి చెందిన వారు కూడా అలాగే ఉన్నారు; మరియు పరలోక సంబంధమైన మనుష్యుడు [క్రీస్తు] ఎలాగో, పరలోకానికి చెందిన వారు కూడా అలాగే ఉన్నారు. మరియు మనం ఎలా భూసంబంధమైన మనుష్యుని స్వరూపాన్ని ధరించామో, అలాగే పరలోక సంబంధమైన మనుష్యుని స్వరూపాన్ని కూడా ధరిస్తాము" (1 కొరింథీయులు 15:48-49). మనమందరం ఆదాముతో ముడిపడి ఉన్నందున, ప్రతి మనిషికి ఆదాములాగే ఒక భౌతిక శరీరం ఉంటుంది. భౌతిక శరీరాలు ఈ భూమిపై జీవితానికి అనువుగా ఉంటాయి, అయినప్పటికీ, ఆదాము ద్వారా ప్రపంచంలోకి మొదట వచ్చిన పాపం కారణంగా అవి మరణం, వ్యాధి మరియు బలహీనతచే పరిమితం చేయబడ్డాయి.
అయితే, శుభవార్త ఏమిటంటే, విశ్వాసులు తమ పరలోక సంబంధమైన శరీరాలు క్రీస్తు శరీరంలాగే అక్షయమైనవిగా, శాశ్వతమైనవిగా, మహిమాన్వమైనవిగా మరియు శక్తితో నిండినవిగా ఉంటాయని నిశ్చయంగా తెలుసుకోవచ్చు. ప్రస్తుతం, అందరూ ఆదాములా ఉన్నారు; ఒక రోజు, విశ్వాసులందరూ క్రీస్తులా ఉంటారు (ఫిలిప్పీయులు 3:21). అపొస్తలుడైన యోహాను విశ్వాసులకు ఇలా వ్రాశాడు, "ప్రియులారా, యిప్పుడు మనము దేవుని పిల్లలమై యున్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంక ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని యెరుగుదుము" (1 యోహాను 3:2).
English
యేసు రెండవ ఆదాము / చివరి ఆదాము అని అనడంలో అర్థం ఏమిటి?