ప్రశ్న
యెహెజ్కేలు ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు
యెహెజ్కేలు యాజకుల వంశంలో పుట్టాడు (యెహెజ్కేలు 1:3), కానీ అతను ప్రవక్తగా దేవుని సేవ చేశాడు. యెహెజ్కేలు 40–48లో యెహెజ్కేలు ఒక గొప్ప మరియు మహిమాన్వితమైన ఆలయం యొక్క వివరణాత్మక దర్శనాన్ని చూస్తాడు. ఈ సుదీర్ఘమైన దర్శనం సంవత్సరాలుగా చాలా ఊహాగానాలకు మరియు వివిధ వ్యాఖ్యానాలకు విషయంగా ఉంది.
క్రీ.పూ. 586లో యెరూషలేము మరియు దేవాలయం బాబిలోనుచే నాశనం చేయబడటానికి ముందే యెహెజ్కేలు తన ప్రవచన పరిచర్యను ప్రారంభించాడు. ఆ నాశనానికి ముందు, అనేక మంది అబద్ధ ప్రవక్తలు దేవుడు తమతో ఉన్నాడని మరియు తమకు ఏమీ జరగదని ప్రజలకు భరోసా ఇచ్చారు (యెహెజ్కేలు 13:8–16). యెరెమ్యా మరియు యెహెజ్కేలు వంటి నిజమైన ప్రవక్తలు దేవుని తీర్పు రాబోతోందని ప్రజలను హెచ్చరించారు (యెహెజ్కేలు 2:3–8). యెహెజ్కేలు 8–11లో, ఆ ప్రవక్త దేవుని మహిమ ఆలయం నుండి వెళ్ళిపోవడాన్ని చూస్తాడు.
వాస్తవ్యంలో, తీర్పు శాశ్వతంగా ఉండదని, దేవుడు ఇశ్రాయేలును పునరుద్ధరించి, మరలా వారి మధ్య నివసిస్తాడని ఆయన ఇశ్రాయేలుకు ధైర్యం చెప్పాడు. యెహెజ్కేలు 37లో ఆయన "ఎండిన ఎముకల లోయ" దర్శనాన్ని వివరిస్తాడు, దీనిలో చనిపోయిన ఇశ్రాయేలు యొక్క పునరేకీకరణ మరియు పునరుజ్జీవనం గురించి ఆయన వివరిస్తాడు. అధ్యాయాలు 38–39లో, గోగ్ మరియు మాగోగ్తో జరిగే యుద్ధాన్ని యెహెజ్కేలు ప్రవచించాడు, దీనిలో ఇశ్రాయేలు శత్రువులు ఓడిపోతారు. ఆ తర్వాత, 40–48 అధ్యాయాలలో, ఇశ్రాయేలు చెరలో ఇరవైయైదవ సంవత్సరంలో, యెహెజ్కేలు ఒక అతి విశాలమైన కొత్త దేవాలయాన్ని (40–42 అధ్యాయాలు) వర్ణిస్తాడు. దేవుని మహిమ తిరిగి వస్తుంది (43వ అధ్యాయం), బలులు తిరిగి ప్రారంభమవుతాయి (44–46 అధ్యాయాలు), మరియు ఆ దేశం ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి ఇవ్వబడుతుంది (47–48). ప్రజల హృదయాలు మార్చబడి ఉంటాయి (యెహెజ్కేలు 36:26–27), మరియు పునరుద్ధరించబడిన రాజ్యంలో అన్యజనులకు కూడా ఒక స్థానం ఉంటుంది (యెహెజ్కేలు 47:22). ఆ దేశాన్ని ఒక దావీదు వంశపు యువరాజు పరిపాలిస్తాడు (యెహెజ్కేలు 44:3; 37:24–25; 34:23–24కూడా చూడండి).
దేవాలయం గురించిన తన దర్శనంలో, యెహెజ్కేలు ఇశ్రాయేలుకు తీసుకువెళ్లబడ్డాడు, అక్కడ అతను ఒక పర్వతాన్ని, ఒక నగరాన్ని చూశాడు. అతనికి "ఒక మనుష్యుడుండెను. ఆయన మెరయుచున్న యిత్తడి వలె కనబడెను, దారమును కొలకఱ్ఱయు చేతపట్టుకొని ద్వారములో ఆయన నిలువబడియుండెను" (యెహెజ్కేలు 40:3, BSI తెలుగు అనువాదం). "నరపుత్రుడా, నేను నీకు చూపుచున్న వాటినన్నిటిని కన్నులార చూచి చెవులార విని మనస్సులో ఉంచుకొనుము; నేను వాటిని నీకు చూపుటకై నీవిచ్చటికి తేబడితివి, నీకు కనబడు వాటినన్నిటిని ఇశ్రాయేలీయులకు తెలియజేయుము" (వచనం 4, BSI). ఆలయ సముదాయం యొక్క నమూనా కొలతలు యెహెజ్కేలు గ్రంథంలోని తర్వాతి మూడు అధ్యాయాలలో వివరించబడ్డాయి.
యెహెజ్కేలు ఆలయం యొక్క దర్శనం ఎప్పుడు, ఎలా నెరవేరుతుంది అనేది ప్రశ్న. మనం దీనిని అక్షరాలా నెరవేర్పుగా చూడాలా? లేక తన ప్రజల మధ్య దేవుని సన్నిధి యొక్క భవిష్యత్ పరిపూర్ణతకు ఈ దర్శనం ప్రతీకగా ఉందా? ఇది ఇప్పటికే నెరవేరిందా? లేక నెరవేర్పు ఇంకా భవిష్యత్తులో ఉందా? యెహెజ్కేలు ఆలయం భవిష్యత్తులో ఉంటే, అది సంఘ యుగంలో, సహస్రాబ్దిలో, లేక నిత్యత్వ స్థితిలో నెరవేరుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు, బహుశా, ప్రవచనం మరియు నెరవేర్పు యొక్క అక్షర లేదా ప్రతీకాత్మక స్వభావం గురించి వ్యాఖ్యాత యొక్క ముందస్తు భావనల ద్వారా నిర్ణయించబడతాయి.
యెహెజ్కేలు ఆలయ ప్రవచనం అక్షరాలా నెరవేరాలని వాదించడానికి, యెహెజ్కేలు దర్శనంలోని అనేక వివరాలు మరియు ఆలయం యొక్క నిర్దిష్ట కొలతలు ఆధారం. ఆ దర్శనం అక్షరాలా నెరవేరవలసి వస్తే, ఆ నెరవేర్పు భవిష్యత్తులో జరగాలి, ఎందుకంటే యెహెజ్కేలు 40–48లో వర్ణించబడినటువంటిది ఇప్పటివరకు ఏదీ జరగలేదు. యేసు కాలంలోని ఆలయం కంటే యెహెజ్కేలు ఆలయం యొక్క కొలతలు చాలా పెద్దవి, మరియు ఆ ఆలయం కూడా ఒక గొప్ప కట్టడం.
యెహెజ్కేలు ఆలయం యొక్క అక్షరార్థ నెరవేర్పును ఆశించే చాలామంది, అది భూమిపై క్రీస్తు యొక్క 1,000 సంవత్సరాల పాలన అయిన సహస్రాబ్ది రాజ్యంలో నిర్మించబడుతుందని ఆశిస్తారు. సహస్రాబ్దిలో, ప్రస్తుత కాలం నుండి మహిమపరచబడిన పరిశుద్ధులు, ఇంకా రక్షణ పొందడానికి క్రీస్తును స్వీకరించాలనే నిర్ణయం తీసుకోవలసిన సహజ మానవులతో కలిసి జీవిస్తారు—మరియు చాలామంది ఆయనను నమ్మకపోవడానికే ఎంచుకుంటారు. యెహెజ్కేలులో వివరించబడిన బలి పద్ధతి పాపాల క్షమాపణ కోసం కాదు, ఎందుకంటే క్రీస్తు దానిని ఒకసారి శాశ్వతంగా నెరవేర్చాడు (హెబ్రీయులు 10:1–4, 11–14). ఈ వ్యాఖ్యానాత్మక విధానంలో, బలులు క్రీస్తు మరణానికి స్మారకంగా లేదా ఆలయ ఉత్సవ శుద్ధికి సంబంధించిన క్రమంగా చూడబడతాయి, కానీ పాపాలను క్షమించడానికి ఒక మార్గంగా కాదు.
యెహెజ్కేలు ఆలయం యొక్క రూపక దృష్టిలో, ప్రవక్త దర్శనం దేవుడు తన ప్రజలతో మరలా పరిపూర్ణమైన సంబంధంలో నివసిస్తాడని పునరుద్ఘాటిస్తుంది. ఈ సంబంధం ఆ కాలపు ప్రజలకు (ముఖ్యంగా యాజకుడైన యెహెజ్కేలుకు) అర్థమయ్యే భాషలో వివరించబడింది—అద్భుతమైన పరిమాణాలతో కూడిన ఒక యూదుల ఆలయం, క్రమమైన, పరిపూర్ణమైన బలులు, మెస్సయ్య అధ్యక్షత వహించడం, మరియు దేవుని మహిమ స్పష్టంగా కనిపించడం. తరువాతి ప్రవక్తలకు వచ్చిన దర్శనాలలో, తాను దీనిని ఎలా నెరవేరుస్తాడో దేవుడు మరింతగా వెల్లడించాడు; అందులో మెస్సయ్యయే ఆలయానికి, బలులకు మరియు దేశానికి బదులుగా నిలుస్తాడు. పరిశుద్ధాత్మ నివాసం ద్వారా దేవుని సన్నిధి మునుపెన్నడూ లేనంతగా తక్షణమే స్పష్టమవుతుంది. అందువల్ల, యెహెజ్కేలు యొక్క ఆలయం యొక్క నెరవేర్పును కొంతవరకు సంఘయుగంలో మరియు రాబోయే యుగంలో పరిపూర్ణంగా గ్రహించవచ్చు.
ఏ విధానాన్ని తీసుకున్నా, యెహెజ్కేలు ఆలయ దర్శనం దేవుడు తన ప్రజలను విడిచిపెట్టలేదని మరియు వారితో ఆయన సంబంధం పునరుద్ధరించబడి, మునుపెన్నడూ ఊహించని ఒక కొత్త మహిమకు మరియు సన్నిహితత్వానికి పెంచబడుతుందని చెబుతుంది. ప్రస్తుత పరిస్థితులు దేవుని వాగ్దానాలపై ఎన్నడూ సందేహం కలగనివ్వకూడదు.
English
యెహెజ్కేలు ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి?